సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి (R Narayana Murthy) మీడియా సమావేశం నిర్వహించారు. ‘ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అనడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వం తండ్రిలాంటిదని వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
నారాయణ మూర్తి మాట్లాడుతూ… ‘‘గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. అవార్డుల విజేతలకు నా అభినందనలు. ఏపీలో సీఎం చంద్రబాబు (Chandra babu) కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నాను. పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. అయితే, తన చిత్రం ‘హరి హర వీరమల్లు’ ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రమ్మని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేది’’ అన్నారు.
అలాగే ‘‘బంద్ అనేది బ్రహ్మాస్తం. నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరిహర వీరమల్లు’కు లింకు పెట్టడం సరికాదు.
పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవాలని అనడంలో తప్పులేదు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి?. సింగిల్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. సింగిల్ థియేటర్లు కల్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుంది’’.
అలాగే ‘‘సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర ‘షోలే’, ‘మోఘల్ ఏ ఆజాం’ లాంటి సినిమాలు వచ్చాయి.
వాటికోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ఐదేళ్లు ‘లవకుశ’ తీశారు.. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.